న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్న రాణి కమలాపతి రైల్వేస్టేషన్కు శతాబ్ది ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రైలులో ఫైర్ అలారం మోగింది. దీంతో అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత బీనా రైల్వేస్టేషన్ సమీపంలో రైలును అత్యవసరంగా నిలిపివేశారు. అయితే, ఎలాంటి జరగ్గకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఫైర్ అలారం సిస్టమ్లోకి ఎలుక ప్రవేశించడంతోనే అలారం మోగిందని తేలింది. ఆ తర్వాత కొద్ది సేపటికే రైలు మళ్లీ బయలుదేరింది.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీ నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12002 మధ్యాహ్నం 12.35 గంటలకు బీనా స్టేషన్ నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత సీ-6 కోచ్లో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగింది. ఆ తర్వాత లోకో పైలట్, రైలు గార్డ్ రైలును నిలిపివేశారు. రైలులో ఉన్న భద్రతా సిబ్బంది సీ-6 కోచ్లోకి వెళ్లి తనిఖీ చేశారు. ఎక్కడా మంటలు కనిపించలేదు. అయితే, అలారం సిస్టమ్లోకి ఎలుక ప్రవేశించినట్లు గుర్తించారు. భద్రతా సిబ్బంది ఎలుకను బయటకు తీశారు.
కొద్దిసేపటి తర్వాత రైలు అక్కడి నుంచి బయలుదేరింది. ఫైర్ అలారం మోగడంతో చాలా మంది రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని వార్త రైలు మొత్తం వ్యాపించింది. చాలా మంది ప్రయాణికులు రైలు దిగి బయటకు వచ్చారు. చివరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీనా డిప్యూటీ ఎస్ఎస్ ఎస్కే జైన్ మాట్లాడుతూ శతాబ్ది రైలులో ఎలాంటి ప్రమాదం జరుగలేదని, ఎలుక ఫైర్ అలారం సిస్టమ్లోకి ప్రవేశించడంతో అలారం మోగిందని తెలిపారు. ఎలుకను తీసేసిన తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా రైలు బయలుదేరిందని తెలిపారు.