న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. రష్మిక ముఖాన్ని మార్చి కృత్రిమ మేధ ఆధారంగా తయారు చేసిన నకిలీ వీడియోపై రష్మిక సహా పలువురు సినీ, ఇతర రంగాల ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఈ నెల 17లోగా తమకు నివేదిక అందించాలని పోలీస్ శాఖను ఆదేశించింది.