లక్నో: బీజేపీ ఎంపీ తన కుమార్తెకు తండ్రని ఒక మహిళ ఆరోపించింది. ఆ ఎంపీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో సహా ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎంపీ రవి కిషన్ శుక్లా (Ravi Kishan Shukla) తన కుమార్తెకు తండ్రి అని అపర్ణా సోని అలియాస్ అపర్ణా ఠాకూర్ ఆరోపించింది. ముంబై పోలీస్ స్టేషన్లో దీని గురించి ఆమె ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 15న లక్నోలో మీడియా సమావేశం నిర్వహించడంతోపాటు ఈ విషయాన్ని వెల్లడించింది.
కాగా, రవికిషన్ భార్య ప్రీతి శుక్లా మంగళవారం రాత్రి హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అండర్ వరల్డ్తో సంబంధాలున్నాయంటూ అపర్ణా ఠాకూర్ తనను బెదిరించడంతోపాటు రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించింది. డిమాండ్ను నెరవేర్చకపోతే తన భర్త రవి కిషన్ను తప్పుడు అత్యాచారం కేసులో ఇరికించి ఆయన ప్రతిష్టను దెబ్బతిస్తానని అపర్ణాతోపాటు ఇతరులు తనను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అపర్ణా ఠాకూర్, ఆమె భర్త రాజేష్ సోనీ, కూతురు షెనోవా సోనీ, కొడుకు సొనాక్ సోనీ, సమాజ్వాదీ పార్టీ నేత వివేక్ కుమార్ పాండేతోపాటు జర్నలిస్టు ఖుర్షీద్ ఖాన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.