డెహ్రాడూన్: రద్దీగా ఉన్న రోడ్డులో కారు దిగి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ నేగీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రోజు రిషికేశ్లోని శివాజీ నగర్ గుండా వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ట్రాఫిక్లో ఇరుక్కుంది. ఈ సందర్భంగా మంత్రి కారు దిగి పక్కన బైక్పై వ్యక్తులను ఏం మాట్లాడుతున్నారని నిలదీశాడు. దాంతో బైక్పై ఉన్న ఓ వ్యక్తి నీ గురించి కాదు అని సమాధానమిచ్చాడు. దాంతో ఆగ్రహానికి లోనైనా మంత్రి ఆ వ్యక్తిపై చేయిచేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. రిషికేశ్కు చెందిన సురేంద్రసింగ్ నేగీ అనే వ్యక్తి తన స్నేహితుడు ధరమ్వీర్తో కలిసి బైక్పై పనిమీద బయలుదేరాడు. శివాజీనగర్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ కావడంతో మంత్రి ప్రేమ్చంద్ కారు పక్కనే వారి బైక్ ఆగింది. ఈ సందర్భంగా మంత్రిని చూసి వాళ్లు మాట్లాడుకుంటుండగా గమనించిన మంత్రి ఏం మాట్లాడుకుంటున్నారంటూ కోపంతో కిందకు దిగారు. దాంతో నీ గురించి కాదని నేగీ సమాధానమిచ్చాడు. దాంతో ఆగ్రహించిన మంత్రి నేగీపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మంత్రి గన్మ్యాన్, పీఆర్వో, మరో నలుగురు అనుచరులు కూడా నేగీని కొట్టారు.
దాంతో నేగీ స్థానిక పోలీస్స్టేషన్లో మంత్రిపై, ఆయన గన్మ్యాన్పై, పీఆర్వోపై, అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. నేగీ బంధువులు, కాలనీ వాసులు పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మంత్రి దాడి చేసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మంత్రి పీఆర్వో కూడా.. నేగీ మంత్రి కారుపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. దాంతో నేగీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.