కోల్కతా : బెంగాలీలపై విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, నటుడు పరేష్ రావల్పై కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పరేష్ రావల్పై సీపీఎం బెంగాల్ కార్యదర్శి మహ్మద్ సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు బెంగాలీలు, ఇతర వర్గాల మధ్య ఘర్షణలను ప్రేరేపించేలా ఉన్నాయని, సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సలీం ఆరోపించారు.
రాష్ర్టం వెలుపల పెద్దసంఖ్యలో నివసించే బెంగాలీలను పరేష్ రావల్ వ్యాఖ్యలతో టార్గెట్ చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరేష్ రావల్పై కోల్కతా పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 153ఏ, 153బీ, 504,505 కింద కేసు నమోదు చేశారు. గుజరాత్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తూ ద్రవ్యోల్బణం, గ్యాస్ సిలిండర్లను బెంగాలీలు, చేపలతో ముడిపెడుతూ పరేష్ రావల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు ఖరీదే అయినా అవి దిగివస్తాయి..ప్రజలు ఉపాధి కూడా పొందుతారు. అయితే ఢిల్లీ తరహాలో రోహింగ్యాలు, బంగ్లాదేశీలూ మీ చుట్టూ నివసిస్తే ఏం జరుగుతుంది..? గ్యాస్ సిలిండర్లతో మీరేం చేస్తారు..? బెంగాలీల కోసం చేపలు వండరా అంటూ ఆయన ఓ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
పరేష్ రావల్ తన వ్యాఖ్యలపై ఇటీవల క్షమాపణ చెప్పారు. తాను అక్రమంగా దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీలు, రోహింగ్యాల గురించేనని ఆయన స్పష్టం చేశారు. ఇక పరేష్ రావల్ బెంగాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఎంసీ ఖండించింది. గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను సొమ్ము చేసుకుని మోదీ అధికారంలోకి వచ్చిన సంగతి పరేష్ రావల్ మరిచిపోయినట్టున్నారని టీఎంసీ ఐటీ చీఫ్ దేవాన్షు భట్టాచార్య పేర్కొన్నారు. గ్యాస్ ధరలు పెరిగితే హిందువులు, ముస్లింలు ఇద్దరిపై ప్రభావం ఉంటుందని ఓ మై గాడ్ వంటి సినిమా చేసిన పరేష్ రావల్ గుజరాత్లో ఓట్ల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.