పట్నా: బీహార్లో 11 సార్లు కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) డోసులు తీసుకున్న వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మాధేపుర జిల్లాకు చెందిన ఓ 84 వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్ (Brahmadev Mandal).. తాను 11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాని ఈనెల ప్రకటించాడు. 2021, ఫిబ్రవరి 13న తాను మొదటి డోసు తీకున్నానని, డిసెంబర్ వరకు 11 డోసులు వేయించుకున్నానని చెప్పాడు. 12వ డోసు తీసుకునేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లానని.. అక్కడ టీకాల కార్యక్రమం ముగిసిందని విచారం వ్యక్తంచేశారు.
అయితే 11 డోసులు తీసుకున్నప్పటికీ తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని తెలిపారు. తాను ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నానో రాసి పెట్టికున్నానని చెప్పారు. అయితే ఈ విషయమై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో పురైనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బ్రహ్మదేవ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
బ్రహ్మదేవ్ మండల్ వేర్వేరు తేదీల్లో కరోనా వ్యాక్సిన్ 11 డోసులు తీసుకున్నారు. దీనికోసం వేర్వేరు గుర్తింపు కార్డులు చూపుతూ వైద్యాధికారులను తప్పుదోవ పట్టించాడు. ఇది కొవిడ్ వ్యాక్సినేషన్ నిబంధనలను అతిక్రమించినట్లే. 2021, ఫిబ్రవరి 13 నుంచి ఈ ఏడాది జనవరి 4 వరకు వ్యాక్సిన్ తీసుకున్నాడు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పురైనీ ప్రాథిమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జ్ ఆఫీసర్ పోలీసులు ఫిర్యాదు చేశారు.దీంతో బ్రహ్మదేవ్పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై సెక్షన్ 188, సెక్షన్ 419, సెక్షన్ 420 కింద కేసులు నమోదుచేశామన్నారు.