చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించారు (Cabinet reshuffle). ఆడియో లీక్ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ (పీటీఆర్) పోర్ట్ఫోలియోను మార్చారు. ఐటీ, డిజిటల్ సేవల శాఖను ఆయనకు అప్పగించారు. పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసును ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్బీ రాజాను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. పరిశ్రమల శాఖను ఆయనకు కేటాయించారు. మనో తంగరాజ్ను ఐటీ నుంచి డెయిరీ డెవలప్మెంట్, పశుసంవర్ధక శాఖకు మార్చారు. ఎంపీ సామినాథన్కు ప్రస్తుతం ఉన్న సమాచార, ప్రచార శాఖకు అదనంగా తమిళ అభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన మంత్రివర్గ సహచరుల సమక్షంలో గురువారం రాజ్భవన్లో జరిగిన సాధారణ కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ మేరకు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా, గత నెలలో డీఎంకే మొదటి కుటుంబం ఆస్తుల గురించి మంత్రి పీటీఆర్ మాట్లాడినట్లుగా ఆరోపించిన ఆడియో క్లిప్ను బీజేపీ విడుదల చేసింది. దీంతో ఇది ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెర లేపింది. అయితే అది నకిలీ ఆడియో క్లిప్ అని మంత్రి పీటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ రెండోసారి తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేశారు. ఆర్థిక మంత్రి పీటీఆర్ శాఖను మార్చారు. అలాగే పాడి పరిశ్రమ మంత్రి ఎస్ఎం నాసర్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్కు సిఫార్సు చేయడంతో ఆయన దానిని ఆమోదించారు. పార్టీ కార్యకర్తపై నాసర్ రాయి విసిరిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు.