అయోధ్య, జనవరి 2: అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్ లల్లా విగ్రహంపై నిర్వాహకులు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. స్వామి శంకరాచార్య విజయేంద్ర, ఇతర స్వాములను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు తుది విగ్రహ ఎంపిక ఉంటుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది.
ఆ తర్వాతే బాలరాముడి రూపాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తామని ట్రస్ట్ ఆఫీస్ ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. కాగా, కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు విగ్రహం రామ్లల్లాగా ఎంపికైందని పేర్కొంటూ, అతడిని అభినందనలు తెలియజేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం యెడియూరప్ప ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై యోగిరాజు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాను చేసిన విగ్రహాన్ని ఎంపిక చేసినట్టు అధికారికంగా ఎలాంటి సందేశం రాలేదని తెలిపారు. యోగిరాజు తయారుచేసిన విగ్రహానికే రామ్లల్లాగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది.