లఖింపూర్ ఖీరీ (యూపీ), అక్టోబర్ 10: లఖింపూర్ ఖీరీలో వారం క్రితం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి యూపీ పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ను తాజాగా నమోదు చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న నిరసనకారులు అటుగా వచ్చిన మంత్రి కాన్వాయ్పై దాడికి తెగబడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కార్లలోని వ్యక్తులపై రైతులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే హింసాత్మక ఘటనలో మరణించిన నలుగురు రైతులు, ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆశిష్ మిశ్రా పేరును ఎఫ్ఐఆర్లో ఎక్కడా ప్రస్తావించలేదు. బీజేపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్టు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే, బీజేపీ నేతలను కాపాడటానికి యూపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని రైతు నేతలు ఆరోపించారు. మరోవైపు, బీజేపీ నేతలు, ప్రధాని మోదీకి ఆప్తమిత్రులైన వ్యాపారవేత్తలే దేశంలో సురక్షితంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. ఆశిష్ మిశ్రాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
పార్లమెంటులో మోదీ సంతాపం తెలుపాలి
లఖింపూర్ ఖీరీ ఘటనకు బాధ్యతవహిస్తూ కేంద్రమంత్రి అజయ్మిశ్రా పదవికి రాజీనామా చేయాలని బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయిత్ మరోసారి డిమాండ్ చేశారు. ఆయన పదవిలో కొనసాగేంతవరకూ ఆయన్ని, ఆయన కుమారుడిని ఈ కేసులో ఎవరూ ఏమీచేయలేరని పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.