బెంగళూరు, ఫిబ్రవరి 23: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. సీఎం కుర్చీ కోసం ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా, తాజాగా మంత్రి పదవుల కోసం పార్టీ నేతలు సిగపట్లు పడుతున్నారు. ఈ సారి జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తమకు స్థానం కల్పించాలంటూ తొలిసారిగా ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్కు లేఖ రాశారు. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే వర్గాల పోరుతో సతమతమవుతున్న పార్టీ హైకమాండ్కు తాజా వ్యవహారం తలనొప్పిగా మారింది. అయితే పాలనను గాలికొదిలేసి కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కొట్టుకుంటుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త, యువ నేతలను ప్రజలు కోరుకుంటున్నారనడానికి తమ ఎన్నికే స్పష్టమైన నిదర్శనమని, అయితే ప్రజా తీర్పును గౌరవిస్తూ 2023లో ఏర్పడిన 34 మంది మంత్రివర్గంలో కొత్తవారికెవ్వరికీ స్థానం కల్పించ లేదని కొత్త ఎమ్మెల్యేలు అన్నారు. కాబట్టి ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తొలిసారి ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించడం సముచితమని వారు పేర్కొన్నారు.
కనీసం ఐదు మంది కొత్తవారికి స్థానం కల్పిస్తే అనుభవజ్ఞులు, యువ నేతలతో మంత్రివర్గం సమతూకంగా ఉంటుందని వారు అన్నారు. కాగా కొత్త ఎమ్మెల్యేల ఈ డిమాండ్తో అధిష్ఠానం తలపట్టుకుంటున్నది. 2028లో మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్ బహిరంగంగానే డిమాండ్ చేస్తుండగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పీఠం దిగే ప్రసక్తే లేదని అంటున్నారు.