ముంబై: ఎన్నికల్లో లబ్ధి కోసం మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, వివాదాస్పద అంశాలను లేవనెత్తడం బీజేపీకి అలవాటేనని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హిజాబ్ వంటి వివాదాస్పద అంశాలను లేవనెత్తారని.. ఎన్నికలు పూర్తైనందున ఇప్పుడు అవి పక్కకుపోతాయని పేర్కొన్నది. తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ తెరమీదకు తీసుకొస్తారని బీజేపీ తీరుపై మండిపడింది. ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న సమయంలో తాము ఈ అభివృద్ధి చేశాం అనేది చెప్పుకోకుండా పలు అంశాలకు మత రంగు పూసి వాటిని ప్రాధాన్యతతో ముందుకు తెస్తున్నారని విమర్శించింది. దావూద్ ఇబ్రహీం, పాకిస్థాన్, ఉగ్రవాదం వంటి అంశాలు సరిగ్గా వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు వస్తాయని పేర్కొన్నది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలకు సూచిక అని మోదీ చెప్పుకోవడాన్ని సామ్నా కొట్టిపారేసింది. నాలుగు రాష్ర్టాల్లో బీజేపీ గెలిచినప్పటికీ, లోక్సభ ఎన్నికలపై దీని ప్రభావం ఉండబోదని, 2024లో దేశం కోసం పోరాటం జరుగుతుందని నొక్కిచెప్పింది.