న్యూఢిల్లీ: శనివారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ గగనతలంపై రెండు ఎయిర్ ఇండియా విమానాలు (Air India) ప్రయాణించాయి. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది ప్రాణాలు ముప్పులో పడ్డాయి. ఏప్రిల్ 13, 14 మధ్య రాత్రి వేళ న్యూయార్క్ నుంచి ముంబైకి, ముంబై నుంచి లండన్కు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణించాయి. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిన కొన్ని గంటల ముందు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ పైన ఆ రెండు విమానాలు ఎగిరినట్లు ఫ్లైట్స్ డేటాను ట్రాక్ చేసే ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్ పేర్కొంది.
కాగా, ఎయిర్ ఇండియాతోపాటు మలేషియా ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానాలు కూడా ఇజ్రాయెల్పై దాడికి ముందు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించాయి. అలాగే పలు గ్లోబల్ ఎయిర్లైన్స్ సంస్థలు శనివారం, ఆదివారం మధ్య రాత్రితోపాటు సోమవారం కొన్ని విమానాలను రద్దు చేయడంతోపాటు మరి కొన్నింటిని దారి మళ్లించాయని ఆ వెబ్సైట్ పేర్కొంది.
మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా ఏప్రిల్ 13న కొన్ని విమానాలను ఎయిర్ ఇండియా దారి మళ్లించింది. కొచ్చి నుంచి లండన్ గాట్విక్ విమానాశ్రయం, ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు ప్రయాణించిన విమానాలు ఆఫ్ఘనిస్థాన్ గగనతలం మీదుగా ఎక్కువ దూరం ప్రయాణించాయి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు, సిబ్బందితోపాటు విమానాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది.