చెన్నై: వారిద్దరూ స్నేహితులు. కలిసి చదువుకొన్నారు. ప్రస్తుతం ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు యువతుల్లో ఒకరు మరొకరిపై ఉన్న ప్రేమతో పెండ్లి చేసుకొనేందుకు లింగ మార్పిడితో పురుషుడిగా మారారు. అయితే తాను ప్రేమించిన యువతి.. మరొకరిని ప్రేమిస్తున్నదన్న అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేశాడు. చైన్లతో కట్టేసి, బ్లేడుతో గొంతు కోసి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కెలంబక్కమ్లో చోటుచేసుకొన్నది. పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. మధురైకి చెందిన నందిని, లింగ మార్పిడితో వెట్రిమారన్గా మారిన మహేశ్వరి ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. మధురైలో కలిసి చదువుకొన్నారు. పురుషుడిగా మారిన తర్వాత కూడా వెట్రిమారన్ అలియాస్ మహేశ్వరితో నందిని స్నేహం కొనసాగించింది. అయితే నందిని మరో వ్యక్తిని ప్రేమిస్తున్నదన్న అనుమానంతో ఆమె పుట్టినరోజున సర్ప్రైజ్ ఇస్తానని వెట్రిమారన్ పిలిచాడు. తాను చెప్పిన ప్లేస్కు వచ్చిన నందినిని వెట్రిమారన్ చైన్లతో కట్టేసి గొంతు కోశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు.