సత్నా: హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్థుడిని జైలు మహిళా ఆధికారి వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని సత్నా జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఫిరోజా ఖతూన్ గతంలో జైలు వారెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో నేరస్థుడు ధర్మేంద్ర సింగ్ను కలుసుకున్నారు. ధర్మేంద్ర సింగ్ ఛత్తర్పూర్లోని చంద్లా నివాసి.
2007లో జరిగిన ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఫిరోజా జైలులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ధర్మేంద్ర సింగ్ వారెంట్ సంబంధిత పనులు ఆమె పర్యవేక్షించేవారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.
తరువాత అది ప్రేమకు దారితీసింది. కాగా 14 ఏండ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ధర్మేంద్ర సింగ్ ఏడాది క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అతని సత్ప్రవర్తనను గుర్తించి జైలు అధికారులు అతనిని విడుదల చేశారు. అనంతరం ధర్మేంద్ర సింగ్, ఫిరోజాలు తమ ప్రేమను వివాహంగా మలచుకోవాలని అనుకున్నారు. వీరి వివాహం మే 5న ఛత్తర్పూర్ జిల్లాలో జరిగింది. కాగా సామాజిక భద్రత దృష్ట్యా ధర్మేంద్ర సింగ్ పెండ్లి పత్రికలో తన పేరును మార్చుకున్నాడు. వీరి వివాహం ఆచార సంప్రదాయాల మధ్య జరిగింది. ఈ వివాహానికి ఫిరోజా కుటుంబ సభ్యులు హాజరుకాలేదు.