పాట్నా: ఒక మహిళా కానిస్టేబుల్ దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలు, అత్త గొంతు కోసి చంపింది. (Female Cop Kills Kids) ఆగ్రహం చెందిన భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహిళా కానిస్టేబుల్ నీతూ కుమారి తన కుటుంబంతో కలిసి పోలీస్ క్వార్టర్స్లో నివసిస్తున్నది. నాలుగున్నర ఏళ్ల శివాంశ్, మూడున్నర ఏళ్ల శ్రేయ పిల్లలున్నారు. భర్త పంకజ్ తల్లి అయిన 65 ఏళ్ల ఆశాదేవి కూడా వారితో కలిసి ఉంటున్నది.
కాగా, మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పాల వ్యక్తి వారి ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరూ స్పందించకపోవడంతో పొరుగువారికి ఈ విషయం చెప్పాడు. కొన్ని గంటలకుపైగా ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో క్వార్టర్స్లో నివసించే పోలీస్ సిబ్బంది అనుమానించారు. తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. మహిళా కానిస్టేబుల్ నీతూ కుమారి, ఆమె పిల్లలు, అత్త గొంతు కోసి ఉండి మరణించగా, భర్త పంకజ్ మృతదేహం సీలింగ్కు వేలాడటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు నీతూ భర్త పంకజ్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. తన తల్లి, ఇద్దరు పిల్లల గొంతు కోసి నీతూ హత్య చేసిందని ఆ నోట్లో అతడు ఆరోపించాడు. దీంతో ఆవేశం పట్టలేక భార్య నీతూ గొంతు కోసి హత్య చేశానని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. నీతుకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే తన తల్లి, పిల్లలను ఆమె చంపిందని సూసైడ్ నోట్లో ఆరోపించాడు. అయితే పంకజ్ తన కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.