‘మరో యా కరో.. చునావ్ మే హార్నే పర్ అప్నా అస్థిత్వ్ ఖతమ్ హో జాయేగా’ (గుజరాత్ ఎన్నికల్లో ప్రాణాలు పణంగా పెట్టండి.. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే పార్టీ అస్థిత్వమే కోల్పోతుంది) అంతర్గత సమావేశాల్లో గుజరాత్ బీజేపీ నాయకులు కార్యకర్తలకు చేస్తున్న సూచనలివి.. ఓ విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆందోళనతో గొంతు నుంచి వచ్చిన మాటలు అని కూడా చెప్పవచ్చు!
-(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో భాగంగా కమలం పార్టీ రాష్ట్ర నేతలు సర్వశక్తులు ఒైడ్డెనా తిరిగి, సామదాన దండోపాయాలు ఉపయోగించైనా అధికారంలోకి రావాలని అనుకొంటున్నారు. లేకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో గట్టి దెబ్బ పడటంతో పాటు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అస్థిత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఆందోళన చెందున్నట్టు తెలుస్తున్నది. సీఎం భూపేంద్ర పటేల్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని బీజేపీ నాయకులు అంతర్గత సమావేశాల్లో కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు.
27 ఏండ్లుగా గుజరాత్ను పాలిస్తున్న బీజేపీ సర్కారు మాటలే తప్ప రాష్ట్ర అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. జీఎస్డీపీ, తలసరి ఆదాయం, వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు, ఆదాయాభివృద్ధి రేటు, నీతిఆయోగ్ హెల్త్ ఇండెక్స్, ఇన్నోవేషన్ ఇండెక్స్, సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్, కామర్స్ ఇండెక్స్ వంటి సూచీల్లో.. ఎనిమిదేండ్ల పసిబిడ్డ తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ అసలు పోటీలోనే లేదు. దీనికితోడు గ్రామీణులు, రైతులు, పశువుల పెంపకందార్లు, గిరిజనులు, డాక్టర్లు, టీచర్లు, అటవీ శాఖాధికారులు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు, మాజీ సైనికులు, మధ్యాహ్మ భోజన సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రేషన్ షాపు డీలర్లు ఇలా ప్రతీ వర్గం.. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగులుతున్నది. ఇవన్నీ గమనించిన రాష్ట్ర బీజేపీకి గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏలాగైనా గెలువాలని, గత ఎన్నికల్లో సాధించిన 99 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలంటూ.. ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర నేతలకు టార్గెట్లు నిర్ణయించింది.
హిమాచల్ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ శనివారం ముగియడంతో బీజేపీ నేతలు గుజరాత్లో వాలిపోతున్నారు. పోలింగ్కు 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గుజరాత్కు బయల్దేరిన కమలదండులో 95 శాతం కీలక నేతలు కొన్నిరోజులు అక్కడే మకాం వేయనున్నట్టు సమాచారం. ఓటర్లను ఆకర్షించడానికి ఈ ఏడాదిలోనే రూ.1.3 లక్షల కోట్ల ప్రాజెక్టులను స్వరాష్ర్టానికి కట్టబెట్టిన ప్రధాని మోదీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మంత్రులు రాజ్నాథ్, గడ్కరీ, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా సహా బీజేపీ పాలిత రాష్ర్టాలైన యూపీ, అస్సాం, మధ్యప్రదేశ్ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, శివరాజ్సింగ్ చౌహాన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తదితరులు క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.