BJP | హైదరాబాద్, అక్టోబర్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఓటమి తథ్యమని ముందే తెలుసుకున్న ఆ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలు వస్తాయని భావించిన బీజేపీ ఐదు రాష్ర్టాల ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్దే గెలుపని పలు సర్వేలు.. సెఫాలజిస్టులు ఇప్పటికే తేల్చిచెప్పడంతో మిగతా రాష్ర్టాలపై ఆ పార్టీ దృష్టి సారించింది.
ముఖ్యంగా మధ్యప్రదేశ్లో అధికార పీఠాన్ని కాపాడుకుంటూనే.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు కమలం పార్టీ పడరాని పాట్లు పడుతున్నది. ఆయా రాష్ర్టాల్లో బీజేపీకి ప్రతికూలంగా సర్వే ఫలితాలు వస్తున్నా.. తిమ్మిని బమ్మిని చేసి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నది. ఇటీవల కర్ణాటకలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఏకంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా రంగంలోకి దిగారు. అందులో భాగంగానే రాయపూర్లో పార్టీ ముఖ్యులు, సంఘ్ పరివార్ నేతలతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారని తెలిసింది.
ఈ సమావేశంలో పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కులాల వారీగా సమావేశాలు, విందులు ఏర్పాటు చేసి ఆయా వర్గాలు ఏం ఆశిస్తున్నాయో తెలుసుకోవాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయా వర్గాలు ఆశించిన మేరకు త్వరలో జరగబోయే బహిరంగ సభల్లో ప్రధాని మోదీ వరాల జల్లు కురిపిస్తారని ఆయన చెప్పినట్టు తెలుస్తున్నది.
పరివర్తన్ సభలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమిత్ షా.. ఛత్తీస్గఢ్ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను స్వయంగా తానే తీసుకుంటానని నేతలతో చెప్పినట్టు తెలుస్తున్నది. రైతుల సమస్యలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మరోవైపు సంఘ్ పరివార్, బీజేపీ నేతల మధ్య సమన్వయం గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. కాగా, పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే ఎలాంటి వ్యూహం రచించాలనే అంశం కూడా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.