బెంగళూరు: తక్కువ విద్యుత్తును వినియోగించే కంప్యూటింగ్ వేదికను నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఈఎన్ఎస్ఈ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అభివృద్ధి చేశాయి. భవిష్యత్తులో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నాయి. అత్యంత వేగంగా పనిచేసే అధునాతన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో మనం సంప్రదాయంగా వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తున్న కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్స్ (సీఎంఓఎస్)కు బదులుగా మెమ్రిస్టార్స్ అనే భాగాలను తమ కొత్త తరం కంప్యూటర్లలో వినియోగించామని, అవి డాటాను నిల్వ చేయడంతోపాటు గణనకు సంబంధించిన పనులు చేయగలదని పరిశోధకులు పేర్కొన్నారు.