శ్రీనగర్: కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశాన్ని మత పరంగా విభజిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. శనివారం రాజౌరి జిల్లాలోని నౌషేరాలో మీడియాతో ఆయన మాట్లాడారు. హిందువులే కాదు, ముస్లింలు కూడా ఉగ్రవాదుల దాడుల్లో మరణిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్కు కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవన్నారు.
ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించే వరకు జమ్ముకశ్మీర్లో శాంతిని తీసుకురావడం సాధ్యం కాదని ఫరూక్ తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఉగ్రవాద నిర్మూలన జరుగుతుందని చెప్పిన వారికి ఇటీవల లోయలో జరుగుతున్న సంఘటనలు కళ్లు తెరిపిస్తాయని విమర్శించారు.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని, 2019 ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కాగా, ఇది జరిగిన రెండేండ్ల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారి శనివారం శ్రీనగర్కు వచ్చారు. అక్కడి భద్రతా పరిస్థితులు, పౌరుల లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
జమ్ముకశ్మీర్లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు జమ్ముకశ్మీర్లో శాంతిని మీ ప్రభుత్వం తీసుకురాలేదని అన్నారు.