శ్రీనగర్: ఆర్టికల్ 370 పునరుద్ధరణకు జమ్ముకశ్మీర్ ప్రజలు రైతుల మాదిరిగా పోరాడాలని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా శ్రీనగర్లోని నసీంబాగ్ సమాధి వద్ద జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. వివాదస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలలకుపైగా పోరాడారని, 700 మందికిపైగా చనిపోయారని అన్నారు. రైతుల బలిదానాలతో దిగి వచ్చిన కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని తెలిపారు.
మన హక్కులను తిరిగి పొందేందుకు మనం కూడా అలాంటి త్యాగాలు చేయాల్సి ఉందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ‘ఇది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 370, 35 ఏ, రాష్ట్ర హోదాను తిరిగి పొందుతామని మేము వాగ్దానం చేశాం. దీని కోసం మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. అయితే తమ పార్టీ హింసకు మద్దతు ఇవ్వదని అన్నారు.