శ్రీనగర్: రాముడు (Bhagwan Ram) కేవలం హిందువులకే (Hindus) దేవుడు కాదని, అందరి దేవుడని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. మతంతో సంబంధం లేదని.. ఆయనపై విశ్వాసం ఉంచినవారందరికీ దేవుడేనని స్పష్టం చేశారు. బీజేపీ (BJP) రాముడి పేరును అధికారంలోకి రావడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నదని విమర్శించారు. కశ్మీర్లోని ఉధంపూర్లో (Udhampur) పాంథర్స్ పార్టీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
భగవాన్ రామ్ హిందువులకు మాత్రమే దేవుడు కాదని, ముస్లిం లేదా క్రిస్టియన్ లేదా అమెరికన్ లేదా రష్యన్ అయినా.. రాముడిపై విశ్వాసం ఉన్న అందరికీ దేవుడేనని చెప్పారు. బీజేపీ నేతలకు రాముడిపై ప్రేమ లేదని, అధికారంపై మాత్రమే ప్రేముందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము రాముడి శిష్యులం, భక్తులం అని ప్రజల వద్దకు వచ్చేవారు మూర్ఖులని విమర్శించారు. జమ్ముకశ్మీర్లో ఎన్నికలను ప్రకటించే సమయానికి ప్రజల దృష్టిని మరల్చడానికి రామ మందిరాన్ని ప్రారంభిస్తారని అనుకుంటున్నానని తెలిపారు. బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యతకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. గతంలో కూడా రాముడు అందరివాడని ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించిన విషయం తెలిసిందే.