శ్రీనగర్, జూన్ 18: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకొని తమ ఐక్యత చాటాలనుకొంటున్న విపక్షాలకు ఆ అభ్యర్థి దొరకడమే గగనమైపోయింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసు నుంచి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే తప్పుకోగా.. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండబోనని శనివారం ప్రకటించారు. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలనుకొంటున్నానని స్పష్టం చేశారు. ఫరూక్ అబ్దుల్లా వయస్సు 84 ఏండ్లు. రాష్ట్రపతి ఎన్నికలపై ఇటీవల 17 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. శరద్పవార్ అభ్యర్థిగా ఉండేందుకు తిరస్కరించడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమత.. ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను ప్రతిపాదించారు. రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 29తో ముగియనున్నది. అభ్యర్థి ఎంపికపై విపక్షాలు 21న మరోసారి సమావేశం కానున్నాయి.