చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin)కు జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మద్దతిచ్చారు. ఆయన ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు?, అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన సీఎం స్టాలిన్ 70వ పుట్టిన రోజు వేడుకలకు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్షం కోసం అధికార డీఎంకే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సవాల్ విసిరే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు మద్దతు తెలిపారు. ‘ఆయన ఎందుకు పీఎం కాకూడదు? అందులో తప్పేముంది?’ అని ప్రశ్నించారు.
కాగా, ప్రధాని అయ్యేందుకు స్టాలిన్కు ఉన్న అర్హతలను ఫరూక్ అబ్దుల్లా ప్రశంసించారు. దేశం ఏకత్వం కోసం స్టాలిన్, డీఎంకే చాలా బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ‘భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. మీరు భిన్నత్వాన్ని రక్షిస్తే, ఏకత్వాన్ని రక్షించినట్లే. కాబట్టి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఏకం కావడానికి వారు (డీఎంకే) ప్రయత్నిస్తున్నారు’ అని అబ్దుల్లా కొనియాడారు. ‘ఇది మరింత బలపడుతుందని నేను ఆశిస్తున్నా. ఇతర నాయకులు కూడా అదే విధంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నా. అప్పుడు మనకు సంతోషకరమైన దేశం ఉంటుంది’ అని అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, ఈ దేశానికి నాయకత్వం వహించడానికి ఉత్తమమైన వ్యక్తిని ఉమ్మడి ప్రతిపక్షం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.
I hope you (MK Stalin) live long not only to serve Tamil Nadu but serve India as a whole…India is in a difficult situation. Democracy & Constitution is being threatened. Let's wake up: NC leader Farooq Abdullah at the DMK event in Chennai pic.twitter.com/qdHL77QdXT
— ANI (@ANI) March 1, 2023