న్యూఢిల్లీ/చండీఘర్, డిసెంబర్ 11: దాదాపు ఏడాదికి పైగా సుదీర్ఘ ఉద్యమం అనంతరం రైతన్నలు విజయోత్సాహంతో ఢిల్లీ సరిహద్దుల నుంచి ఇండ్లకు పయనమయ్యారు. రైతులు ఉద్యమ క్షేత్రాల నుంచి తిరిగి ఇంటికివెళ్లే ఘట్టాన్ని రైతునేత రాకేశ్ టికాయిత్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ‘విజయ్ దివస్’లో భాగంగా ట్రాక్టర్లను అందంగా అలంకరించుకోవడంతో పాటు వృద్ధులు రంగుల తలపాగాలు ధరించి యువకులతో కలిసి పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా కదిలారు. ఢిల్లీ-సోనిపేట-కర్నాల్ రహదారితో పాటు పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇండ్లకు చేరుకుంటున్న రైతులకు ఆయా గ్రామాల్లో వారి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతున్నారు. పూలు చల్లుతూ స్వీట్లు తినిపిస్తూ సంబురాలు చేసుకొన్నారు. ఢిల్లీ నుంచి పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు బోర్డర్ వద్ద ఎయిర్క్రాఫ్ట్ ద్వారా పూలవర్షం కురిసింది. ఈ ఎయిర్క్రాఫ్ట్ను ఓ ఎన్ఆర్ఐ ఏర్పాటు చేశారు.
హర్యానాలో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
రైతులు ఇండ్లకు తిరిగి వెళ్తున్న క్రమంలో విషాధ ఘటన ఒకటి చోటుచేసుకొన్నది. హర్యానాలోని హిసార్లో రైతుల ట్రాక్టర్ను ఓ ట్రక్కు ఢీకొన్న ఘటనలో పంజాబ్కి చెందిన ఇద్దరు రైతులు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు రైతులు టెంట్లు, గుడారాలు తీసేయడంతో ఢిల్లీ సరిహద్దుల్లోటన్నుల కొద్ది ప్లాస్టిక్, ఇనుప వస్తువులు, వస్ర్తాలు, టార్పాలిన్ షీట్లు, వెదురు బొంగులు పేరుకుపోయాయి.
సరిహద్దుల్లో భావోద్వేగ వాతావరణం
ఘాజీపూర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కు బయలుదేరిన మొదటి గ్రూపు రైతుల వాహనాలకు బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ పచ్చజెండా ఊపారు. ఇదే సమయంలో ఏడాదికి పైగా ఉద్యమ కేంద్రాల్లోనే కలిసి జీవనం సాగించిన రైతుల మధ్య భావోద్వేగ వాతావరణం నెలకొంది. పంజాబ్కు చెందిన కుల్జీత్ సింగ్ అనే రైతు మాట్లాడుతూ ‘ఈ ఉద్యమం మమ్మల్ని ఏకం చేసింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సాగించిన ఈ ఉద్యమంలో చార్రితక విజయం సాధించాం’ అని పేర్కొన్నారు.