లక్నో/చండీగఢ్, ఆగస్టు 17: లఖింపూర్ హింసాకాండ ఘటనలో బాధిత రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మెర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో రైతులు మహాధర్నా నిర్వహించనున్నారు. గురువారం నుంచి 72 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగనున్నది. ఆందోళనలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి రైతులు తరలివెళ్తున్నారు. పంజాబ్, పలు ఇతర రాష్ర్టాల నుంచి కూడా రైతులు రైలు, ఇతర వాహనాల ద్వారా ఇప్పటికే బయలుదేరారు.
మహిళలతో సహా 2 వేలకు మందికి రైతులు లఖింపూర్ ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరారని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా-ఉగ్రహాన్) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్ నుంచి మరో 10 వేల మంది ధర్నాలో పాల్గొంటారని, వారంతా రైళ్లు, ఇతర వాహనాల ద్వారా లఖింపూర్కు చేరుకుంటారని బీకేయూ(దోబా) అధ్యక్షులు మంజిత్ సింగ్ రాయ్ తెలిపారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతో పాటు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది ఆక్టోబర్ 3న లఖింపూర్లో రైతులను వాహనాలతో తొక్కించి చంపిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాను అరెస్టు చేశారు.