Poultry Deal | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జీ-20 సదస్సులో భాగంగా భారత్-అమెరికా మధ్య కుదిరిన పౌల్ట్రీ ఒప్పందంపై దేశీయ రైతులు, పౌల్ట్రీ రంగంలోని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా డీల్ ఉన్నదంటూ మండిపడ్డారు. డీల్లో భాగంగా అమెరికా నుంచి చికెన్ లెగ్స్, లివర్ తదితర ఉత్పత్తులు పెద్దయెత్తున భారత్కు దిగుమతి కానున్నాయి.
దీనిపై సుంకాన్ని కూడా బాగా తగ్గించారు. అయితే, అమెరికన్లు అంతగా ప్రాధాన్యం ఇవ్వని లివర్ తదితర ఉత్పత్తులు భారత్కు దిగుమతి అయితే, తమ వ్యాపారాలు, ఉపాధికి నష్టం వాటిల్లుతుందని రైతులు, వ్యాపారులు ఆరోపించారు. అమెరికన్లు కోళ్ల పెంపకానికి పంది, గొడ్డు మాంసాన్ని దాణాగా వినియోగిస్తారని వాళ్లు చెబుతున్నారు. అలాంటి దాణాతో పెరిగిన కోడి మాంసాన్ని భారతీయులు ఎలా అంగీకరిస్తారని నిలదీశారు. అమెరికన్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా.. రైతులకు నష్టంకలిగించేలా ఉన్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకపోతే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.