ప్రస్తుతం ఉన్న ఎరువుల పంపిణీ వ్యవస్థను చక్కదిద్దలేని కేంద్రంలోని మోదీ సర్కార్.. ఇటీవల ‘ఒకే దేశం-ఒకే ఎరువు’ అంటూ ఓ సంచిని తీసుకొచ్చింది. ఆ సంచి అక్కరకు వచ్చిందా అంటే అదీ లేదు.
ఆగ్రా, అక్టోబర్ 30: ఎరువుల కోసం ఓ రైతు లైన్లో నిల్చొని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్నది. ఫిరోజాబాద్లో రైతులు తెల్లవారుజాము నుంచే ఎరువుల దుకాణాల ముందు భారీ లైన్లు కడుతున్నారు. ఈ లైన్లలో గంటల తరబడి నిలబడి రైతు రామ్ బ్రజేశ్ (60) కుప్పకూలాడు. దీంతో అక్కడే ఉన్న తోటి రైతులు సమీప దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ కన్నుమూశాడు. ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది. రైతుకు ఎరువును అందించలేని బీజేపీ సర్కార్పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. యాసంగి సీజన్ ప్రారంభం అయినా యూపీలో ఎరువుల కొరత వేధిస్తున్నది. ఎరువుల కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
అడుగడుగునా దగా.. దోపిడీ
వ్యవసాయానికి డీఏపీ ఎరువు చాలా అవసరం. ఎకరాకు దాదాపు 100 కిలోల ఎరువు కావాలి. దీన్ని అవకాశంగా మల్చుకొంటున్న వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వాస్తవానికి 50 కిలోల సంచిని రూ.1,350 అమ్మాల్సి ఉండగా.. రూ.1,750కి విక్రయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన యూపీ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చొన్నది. దీంతో రైతన్నలు దోపిడీకి గురవుతున్నారు. ఒకవేళ రూ.1,750 ఖర్చు పెట్టి కొందామన్న సరిపడా దొరకని పరిస్థితి. మరోవైపు బూడిద, మట్టి కలిపిన నకిలీ డీఏపీ సంచులను అంటగడుతున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. శనివారం ఆగ్రా జిల్లాలోని ఓ ఎరువుల గిడ్డంగిని ముట్టడించారు.
ఒక్క సంచి కూడా దొరకలే
డీఏపీ ఎరువు కోసం స్థానిక కో-ఆపరేటివ్ సొసైటీ చుట్టూ 2 రోజులుగా తిరుగుతున్నా. శనివా రం రోజంతా అక్కడే ఉన్నా. కానీ ఒక్క సంచి కూడా దొరకలేదు. నేనే కాదు.. నా లాంటి వందల మంది రైతులదీ ఇదే పరిస్థితి.
– రైతు జోగ్ రాజ్ సింగ్, యూపీలోని ఎటా వాసి