లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే, ఆ ఘటన ఒక ప్రణాళికబద్దమైన కుట్ర అని ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం వెల్లడించింది. అంతేగాక, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశీశ్ మిశ్రాపై ఇప్పటికే నమోదైన అభియోగాలను మార్చాలని కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి సిట్ లేఖ రాసింది.
కాగా, లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకు అశీశ్ మిశ్రాపైన, అతని సహనిందితుపైన ఇప్పటికే హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటితోపాటు హత్యాయత్నం, ఇతర అభియోగాలను కూడా చేర్చనున్నట్లు సిట్ పేర్కొన్నది.