బెంగళూరు, ఫిబ్రవరి 6: కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై రైతులు కన్నెర్ర చేశారు. అన్నదాతలకు రుణాల మాఫీ చేయాలని, త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు మంగళవారం ‘బెంగళూరు చలో’ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా దాదాపు 5 వేల మంది రైతులు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్కు చేరుకొన్నారు. రాష్ట్ర చెరకు రైతుల సంఘం అధ్యక్షుడు కురుబురు శాంతకుమార్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం గత బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.13 వేల కోట్ల మేర కేటాయింపులు కోత విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న బడ్జెట్లోవ్యవసాయానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
పంట నష్టాలతో రుణ ఊబిలో చిక్కుకుపోయిన రైతులకు రుణమాఫీ చేయాలని శాంతకుమార్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం సిద్ధరామయ్య రానున్న బడ్జెట్లో పరిష్కారం చూపాలన్నారు. అన్నదాతలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్న దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారని పేర్కొన్నారు. వ్యవసాయదారులను పెండ్లి చేసుకొనే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పరిశ్రమల కోసం వ్యవసాయ భూముల సేకరణను ఆపాలని, ఒక వేళ తన భూమిని ఇచ్చిన రైతును వాటాదారుగా చేర్చాలని, తమిళనాడుకు నీటిని విడుదల చేయడం ద్వారా నష్టపోయిన కావేరీ బేసిన్ రైతులకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు.
కర్ణాటకలో కరువు, పంట నష్టాలు, అప్పుల బాధతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వందలాది మంది అన్నదాతలు గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
601 రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడు నెలల్లో ఆత్మహత్యకు పాల్పడిన అన్నదాతల సంఖ్య
3 సగటున రోజుకు ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతుల సంఖ్య
223 రాష్ట్రంలోని 236 తాలూకాలకు గానూ 223 తాలూకాలను ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.
మూడు జిల్లాల్లోనే 1/3 వంతు ఆత్మహత్యలు
హవేరీ 62
బెళగావి 56
చిక్కమగళూరు 49