ఘాజియాబాద్, జూలై 4: వివాదాస్పద సాగు చట్టాలు వెనక్కి తీసుకోనే వరకు కేంద్ర ప్రభుత్వంపై దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాదిన్నర పాటు అలుపెరుగని పోరాటం చేసిన రైతన్నలు మరో పోరాటానికి సిద్ధమౌతున్నారు. సాగు చట్టాల ఉపసంహరణ సమయంలో ఎమ్మెఎస్పీకి చట్టబద్ధత, రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం తదితర అంశాలపై రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహంపై తిరిగి ఉద్యమ పంథా ఎంచుకున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఆదివారం జరిగిన రైతు సంఘాల జాతీయ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. తమ డిమాండ్ల సాధనతో పాటు సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి మోదీ సర్కారు ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు పేర్కొన్నాయి.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజు నుంచి..
హామీల అమలులో మోదీ సర్కారు చేసిన మోసంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభయ్యే రోజు జూలై 18 నుంచి 31 వరకు ‘ద్రోహానికి వ్యతిరేకంగా పోరాటం’ పేరుతో దేశవ్యాప్తంగా జిల్లాస్థాయిల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు రైతు సంఘాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అదేవిధంగా ఈ ప్రచారం ముగింపు రోజున అంటే జూలై 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన జాతీయ రహదారులపై చక్కాజామ్(రోడ్ల దిగ్బంధనం) చేపడుతామని ఎస్కేఎం ప్రకటించింది. ఎమ్మెఎస్పీకి చట్టబద్ధత హమీ నెరవేర్చలేదని, సాగుచట్టాలపై ఆందోళనల సమయంలో రైతులపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోలేదని మండిపడింది.
అగ్నిపథ్ దేశ వ్యతిరేకం
సాయుధ దళాల్లో తీసుకొచ్చిన కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానం అగ్నిపథ్ స్కీమ్పై రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కొత్త విధానం దేశ వ్యతిరేక, యువత వ్యతిరేక, రైతు వ్యతిరేకమైనదిగా అభివర్ణించాయి. అగ్నిపథ్పై ఉద్యమానికి నిరుద్యోగ యువత, మాజీ సైనికాధికారులు, జవాన్లను సమీకరించాలని రైతు సంఘాలు జాతీయ సమావేశంలో నిర్ణయించాయి. అగ్నిపథ్ స్కీమ్ వెనుక కుట్రలను వివరించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 7 నుంచి 14 వరకు ‘జై జవాన్, జై కిసాన్’ పేరుతో సదస్సులు నిర్వహిస్తామని, వీటికి నిరుద్యోగ యువతతో పాటు మాజీ సైనికులను కూడా ఆహ్వానిస్తామని ఎస్కేఎం పేర్కొన్నది.