చండీఘఢ్ : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14, 16, 17 తేదీల్లో పలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనుండగా మోదీ టూర్ను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 14న జలంధర్లో తొలి ర్యాలీలో పాల్గొననుండగా, 16న పఠాన్కోట్, 17న అబోహర్లో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని పంజాబ్లో పర్యటించదలుచుకుంటే ఆయన హెలికాఫ్టర్ లేదా విమానాల్లో ప్రయాణించాలని, రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే ఆయనకు నిరసన సెగలు తప్పవని కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టూ స్పష్టం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏడాది పాటు రోడ్లపై గడిపిన విషయాన్ని పంజాబీలు మరువలేదని అన్నారు. రైతుల నిరసనల్లో అన్నదాతలకు ఎదురైన ఇబ్బందులను వారు ఎలా మరిచిపోతారని బిట్టూ నిలదీశారు.
నిరసనల్లో దాదాపు 700 మందికి పైగా రైతులు మరణించారని గుర్తుచేశారు. కాగా గత నెలలో పంజాబ్లోని ఫిరోజ్పూర్లో రైతుల ఆందోళనలతో ప్రధాని మోదీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్పై నిలిచిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వ తీరును తప్పుపట్టగా భద్రతా వైఫల్యంపై రిటైర్డ్ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా నేతృత్వంలో దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేర్వేరుగా దర్యాప్తు కమిటీలను ఏర్పాటు చేసి విచారణను సాగిస్తున్నాయి.
ఇక పంజాబ్లో ఈనెల 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పంజాబ్లో పాగా వేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పావులు కదుపుతోంది. మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలతో అన్నదాతలు అకాలీదళ్కు వెన్నుదన్నుగా నిలుస్తారని ఆ పార్టీ యోచిస్తోంది. ఇక కెప్టెన్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్తో పొత్తుతో సత్తా చాటేందుకు కాషాయ పార్టీ సన్నద్ధమైంది.