న్యూఢిల్లీ, మార్చి 13: సాగుకు నీరు, పంటకు కనీస మద్దతు ధర కోసం రైతన్నలు మరోసారి దేశ రాజధానిలో ఆందోళన ప్రారంభించారు. పంజాబ్కు చెందిన ఐదు రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.
ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పంటలకు కనీస మద్దతు ధరల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాగు నీటి పంపకాలు సక్రమంగా జరగడం లేదని, నీరు అందక తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వాపోయారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖను సంబంధిత అధికారులకు రైతులు అందజేశారు.