న్యూఢిల్లీ: తమను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలో రైతులకు తెలుసని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘చెవిటి, మూగ ప్రభుత్వాన్ని కిసాన్ పార్లమెంట్ మేల్కొల్పింది. పార్లమెంటును ఎలా నడుపుకోవాలో, గ్రామంలో తమను నిర్లక్ష్యం చేసేవారికి గుణ పాఠం నేర్పడం కూడా రైతులకు తెలుసు. దానిని ఎవరూ మర్చిపోకూడదు’ అని అందులో పేర్కొన్నారు. భారతదేశం ఆత్మ, స్వేచ్ఛను కాపాడటానికి రైతులంతా ఐక్యంగా ఉండాలని తికాయిత్ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో గత ఎనిమిది నెలలుగా నిరసన తెలుపుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం నుంచి కిసాన్ పార్లమెంట్ను నిర్వహిస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నారు.