Farmers Protest | చండీగఢ్: కనీస మద్దతు ధరకు(ఎంఎంస్పీ) చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు. రైతాంగం ఢిల్లీ వైపుగా వెళ్లనీయకుండా భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వేలాది మంది రైతులు పంజాబ్-హర్యానా సరిహద్దులోనే గత 10 రోజులకు పైగా నిలిచిపోయారు. ఢిల్లీకి మార్చ్గా వెళ్లేందుకు శంభు, ఖనౌరి సరిహద్దుల్లో అన్నదాతలు వేచిచూస్తున్నారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు విఫలమవుతుండటం.. మరోవైపు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులను నియంత్రించేందుకు పోలీసులు టియర్గ్యాస్ ప్రయోగించడంతో ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు పాయింట్ల వద్ద కిలోమీటర్ల మేర రైతులు తమ ట్రాక్టర్లు, ఇతర రూపాల్లో నివాసం ఏర్పరచుకొని ఢిల్లీ పయనానికి వేచిచూస్తున్నారు.
ఈ క్రమంలో వారిని పలుకరించిన ఒక మీడియా సంస్థ వద్ద రైతులు తమ సమస్యలను, కేంద్రంపై ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అమృత్ సింగ్ అనే రైతు మాట్లాడుతూ సొంత దేశంలో పరాయి వాళ్లం అయిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని అన్నారు. ఒక వస్తువును తయారు చేస్తున్న తయారీదారు దాని ధరను నిర్ణయిస్తున్నాడని, అయితే రైతుకు ఆ హక్కు లేకుండా పోయిందని ఎత్తిచూపారు. ఎంఎస్పీకి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతున్నామే తప్ప మరేమీ కాదని అమృత్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని కుటుంబ పెద్ద దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మేం కూడా రైతుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకొంటున్నాం. అయితే మమ్మల్ని శత్రువులుగా చూస్తూ లాఠీలతో కొట్టిస్తూ, టియర్గ్యాస్ వంటివి ప్రయోగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా అన్నదాతలు స్పష్టం చేశారు.