న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: నిమ్మకాయల ధరలు చుక్కలు చూపిస్తుంటే దొంగలకు మాత్రం నోరూరదా? ఎండకాలంలో చల్లదనాన్నిచ్చే నిమ్మకాయ ధరలు మామూలు రోజుల కన్నా ఐదారింతలు పెరిగి కూర్చున్నాయి. యూపీలోని కాన్పూర్ జిల్లా బిట్టూర్ సమీపంలోని శివదిన్ పూర్వా గ్రామంలో అభిషేక్ నిషాద్కు చెందిన తోట నుంచి మూడు రోజుల్లో సుమారు 15,000 నిమ్మకాయలను దొంగలు ఎత్తుకుపోయారు. వాటి బరువు సుమారు 750 కిలోలు ఉంటుందట. మామూలుగా రూ.50-60 మించని నిమ్మకాయల ధర ప్రస్తుతం రూ.300 దాకా పలుకుతున్నది. ఆ లెక్కన చోరీ సొత్తు విలువ 2 లక్షల పైచిలుకే. లబోదిబోమంటూ నిషాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనాలతో అప్రమత్తమైన ఇతర రైతులు తమ తోటలకు 24 గంటలు కాపలాదారులను పెట్టుకుంటున్నారట.