ఛండీగఢ్ : (Farmers agitation) వరి కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం వరకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు వాటర్ కానన్లను ఉపయోగించి చెదరగొట్టారు. కర్నాల్ జిల్లా కేంద్రంలో కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగారు.
హర్యానాలో వరి కొనుగోళ్లు ఆలస్యం అయ్యాయి. దీనిని నిరసిస్తూ రైతులు కదం తొక్కారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో రైతులు కదిలివచ్చారు. అయితే, వీరిని కొంత దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రైతులు ఘర్షణకు దిగారు. బారికేడ్లను తొలగించుకుని ముందుకు వచ్చేందుకు రైతులు ప్రయత్నించారు. పరిస్థితి చేజారి పోకుండా ఉండేందుకు పోలీసులు వాటర్ కానన్లను ఉపయోగించి నిసరనకారులను చెల్లాచెదురు చేశారు. పలువురు రైతులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అసీమ్ గోయల్ నివాసం వెలుపల కూడా నిరసనకారులు ఆందోళనకు దిగారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పరిపక్వత ఆలస్యం కావడంతో పంజాబ్, హర్యానాల్లో ఖరీఫ్ వరి సేకరణను కేంద్రం అక్టోబర్ 11 వరకు వాయిదా వేసింది. ప్రస్తుతం తాజా పంటలో తేమ శాతం అనుమతించదగిన పరిమితికి మించి ఉన్నదని కూడా పేర్కొన్నది. దాంతో వరి కొనుగోళ్లను వాయిదా వేశారు. పంజాబ్లో 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం వరి సేకరణ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాగా, హర్యానాలో సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కావాలి.