న్యూఢిల్లీ, నవంబర్ 20: రైతన్నలు మరో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనలతో వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించి ఈనెల 19(శనివారం) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఏడాది గడిచినా చట్టాల రద్దు ప్రకటన సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ), రైతులపై కేసుల ఉపసంహరణ, ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం తదితర హామీలను కేంద్రం అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేంద్ర సర్కార్ మోసంపై.. దేశ రాజధాని ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘూ వద్ద వచ్చే నెల 11న సమావేశం కావాలని రైతు సంఘాలు నిర్ణయించుకొన్నాయి. రైతులకు కేంద్రం చేసిన ద్రోహంపై ఈ భేటీలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటామని రైతు నేతలు పేర్కొన్నారు.
కేంద్రం ద్రోహం చేసింది: ఎస్కేఎం
డిసెంబర్ 11న సింఘూ వద్ద జరిగే సమావేశానికి ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తదితర రాష్ర్టాల నుంచి రైతులు పాల్గొంటారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సభ్యుడు అభిమన్యు కోహడ్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన రైతులకు నివాళి అర్పించి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు. రైతుల మనుగడకు కీలకమైన ఎంఎస్పీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసిందని, రైతులను దారుణంగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులపై కేసులను ఉపసంహరించుకోకుండా ద్రోహానికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ట్వీట్ చేస్తూ ‘రైతులను వాహనంతో తొక్కించిన కేంద్ర ప్రభుత్వం.. రైతులకు ఎమ్మెస్పీ ఇవ్వలేదు. 733 మంది అమర రైతులకు పరిహారం ఇవ్వలేదు’ అని విమర్శించారు.