Kisan Samman | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు ఏడాదికి రూ. 6 వేలు చెల్లించే పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే ఆ నిధులు పొందాలంటే కార్యాలయాల ముందు ఎండలో బారులు తీరుతూ రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
రైతులు తమ వద్దనున్న భూ యాజమాన్య దస్తావేజులతో సహా అవసరమైన వివరాలతో ఆయా శిబిరాలకు హాజరై తమ పేర్లను నమోదు చేయించుకోవటానికి బారులు తీరుతున్నారు. మే 22 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ శిబిరాలు నిర్వహించినా, రైతులందరూ తమ దస్తావేజులను స్క్రూటినీ చేయించుకోలేక పోయారు. దాంతో ప్రభుత్వం ఈనెల 24 నుంచి తాలూకా స్థాయిలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో ఆన్లైన్ ద్వారా ఆ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేందుకు చర్యలు చేపట్టారు. కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను పొందాలంటే రైతులు ఆయా అధికారుల చుట్టూ తిరగాల్సిందే. లేదా అందుకు సంబంధించిన శిబిరాల్లో వరుస కట్టాల్సిందే.