గాంధీనగర్, ఆగస్టు 8: ‘కాలువ నిర్మాణానికి మీ వ్యవసాయ భూములను ఇవ్వండి’ అని ప్రభుత్వం అడగ్గానే, ఆ రైతన్నలు మరో ఆలోచన చేయకుండా భూముల్ని ఇచ్చేశారు. బదులుగా పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మురిసిపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. 34 ఏండ్లు గడిచింది. హామీ ఇచ్చినట్టు చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని ఇవ్వకుండా అన్నదాతలను ఆ ప్రభుత్వం వేధిస్తూనే ఉన్నది. కోర్టు అక్షింతలు వేసినప్పటికీ, సర్కారు వైఖరిలో మార్పులేదు. దీంతో విసుగుచెందిన ఆ రైతులు.. సంబంధిత ప్రభుత్వాఫీసుకు వెళ్లి కంప్యూటర్లు, ప్రింటర్లను ఎత్తుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఈ ఘటన జరిగింది.
అసలేమైందంటే..
నర్మదా నదీ కాలువ నిర్మాణం కోసం 1988లో అప్పటి గుజరాత్ ప్రభుత్వం వడోదరా జిల్లాలోని అభోల్ గ్రామానికి చెందిన 27 మంది రైతుల నుంచి భూమిని సేకరించింది. ఒక్కో అరేకు (100 చదరపు మీటర్లు) రూ. 1,625 చొప్పున చెల్లిస్తామని హామీనిచ్చింది. 17 ఏండ్ల తర్వాత కాలువ పనులను పర్యవేక్షిస్తున్న సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ సంస్థ ద్వారా అరేకు రూ. 1,400 చొప్పున ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. మిగతా పరిహారం ఇవ్వాలని రైతులు ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. దీంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్తూ.. వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని నిగమ్కు నోటీసులిచ్చింది. అయినప్పటికీ, అధికారులు పరిహారాన్ని విడుదల చేయలేదు. దీంతో నిగమ్ కార్యాలయంలోని చరస్తులను విక్రయించి పరిహారాన్ని తీసుకోవాలని న్యాయస్థానం రైతులకు సూచించింది. ఆస్తుల జప్తునకు సంబంధించి 27 వారెంట్లు జారీ చేసింది. దీంతో గాంధీనగర్లోని నిగమ్ కార్యాలయానికి చేరుకున్న రైతులు రెండు జప్తు వారెంట్ల కింద.. తొమ్మిది కంప్యూటర్లు, ఐదు ప్రింటర్లను తీసుకెళ్లారు. 34 ఏండ్లలో మొత్తంగా రూ. 69 లక్షల వరకూ పరిహారం రావాల్సిఉందని, ఇంకా 25 వారెంట్లు తమదగ్గర ఉన్నాయని రైతుల తరుఫు న్యాయవాది తెలిపారు.