న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ నిర్వహించారు. దీనికి దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది రైతులు, రైతు కూలీలు, ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తున్న పని దినాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లింది.