నోయిడా, జనవరి 24: రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 16న భారత్ బంద్ చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ చెప్పారు. బుధవారం ఆయన ముజాఫర్నగర్లో విలేకరులతో మాట్లాడుతూ ‘పంటలకు కనీస మద్దతు ధర లభించడంలేదు. అసలు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఏదీ?. ఇదే కాదు.. రైతులకు సంబంధించిన చాలా విషయాలను కేంద్రం పట్టించుకోవడం లేదు’ అని విమర్శించారు.
అలాగే దేశంలో నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ పథకాల్లో సమస్యలు ఉన్నాయని, వీటిని కేంద్రం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి భారత్ బంద్ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ బంద్లో సంయుక్త కిసాన్ మోర్చాతోపాటు అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని టికాయిత్ చెప్పారు. ఫిబ్రవరి 16న రైతులు తమ పొలాలకు వెళ్లకుండా నిరసన తెలుపుతారని పేర్కొన్నారు. ఈ బంద్లో రవాణా రంగం కార్మికులతోపాటు ఇతర వర్గాల వాళ్లు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.