WTO | పంజాబ్, హర్యానా సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. శంభు, ఖనౌరీ సరిహద్దులో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) దిష్టిబొమ్మను రైతు సంఘాల దహనం చేశారు. 20 అడుగుల ఎత్తున్న భారీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం, హర్యానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం శంభు సరిహద్దు నుంచి రాజ్పురా వరకు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. దేశంలోని 13 రాష్ట్రాల్లోని 70వేల గ్రామాల్లో ప్రపంచ వాణిజ్య సంస్థ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఉద్యమం దేశంలోని ప్రతీ ప్రాంతానికి చేరుతుందన్నారు. మద్దతు ధర కోసం చట్టం చేసే వరకు దేశంలో రైతులు, కూలీల అప్పులు తీరే వరకు.. లఖింపూర్ ఖేరికి న్యాయం జరిగే వరకు, రైతులపై కేసులను ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. కాలుష్యం నుంచి భారత్ బయట పడేవరకు. 200 రోజుల ఉపాధి, కార్మికులకు రోజుకు రూ.700 వచ్చే వరకు, వాణిజ్య సంస్థ నుంచి భారత్ బయటకు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు.