చండీగఢ్ : రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే, తక్షణమే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రైతు సంఘం నేత సర్వన్ సింగ్ పంధేర్ శనివారం డిమాండ్ చేశారు. శంభు సరిహద్దుల వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం “సీ2 ప్లస్ 50 శాతం”డిమాండ్కు సంబంధించినంత వరకు ప్రభుత్వం “ఏ2 ప్లస్ ఎఫ్ఎల్” ఫార్ములా ప్రకారం ధరను నిర్ణయిస్తున్నదన్నారు.
ఇదే ఫార్ములా ప్రకారం ఆర్డినెన్స్ను తీసుకురావచ్చునన్నారు. రైతుల వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో రుణాల మొత్తాన్ని అంచనా వేయవలసి ఉందని ప్రభుత్వం చెప్తున్నదని తెలిపారు. రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల మధ్య నాలుగో విడత చర్చలు ఆదివారం జరగనున్నాయి.
ఎంఎస్పీకి చట్టబద్ధ హామీతోపాటు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్లలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ శనివారం చెప్పారు. సిసౌలీలో జరిగిన పంచాయత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించకపోతే, నెలాఖరులో ఢిల్లీలో ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చాను కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించామని చెప్పారు.