జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ ప్రయాణిస్తున్న వాహనాలపై దాడి జరిగింది. ఈ ఘటనలో రాకేశ్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలోని టాటర్పూర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. హర్సోరాలో జరిగిన సభలో ప్రసంగించిన రాకేశ్ టికయిత్ అనంతరం బన్సూర్కు వెళ్తుండగా వాహన శ్రేణిపై దాడి జరిగింది. తన కారు ధ్వంసమైన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బీజేపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం మరణించిందని విమర్శించారు. మరోవైపు ఈ దాడికి నిరసనగా రైతులు ఢిల్లీ-ఘాజిపూర్ రహదారిని దిగ్భంధించారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాలకు చెందిన అన్నదాతలు గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. ఈ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోనంత వరకు తమ పోరాటంపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రైతుల పోరాట వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా, మే నెలలో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. అలాగే ఈ నెలలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను ఇటీవల వెల్లడించింది.