న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతులకు లబ్ధి కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు ఆయన సమర్థించుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏఎన్ఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం ఉద్దేశం, రైతుల ఏడాది నిరసన నేపథ్యంలో వాటిని రద్దు చేయడాన్ని ఇకపై వివరించాల్సిన అవసరం లేదన్నారు. ఈ చట్టాలు ఎందుకు ముఖ్యమో అన్నది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల కోసం, వారికి లబ్ధి చేసేందుకే పని చేస్తున్నదని తెలిపారు. రైతులు కూడా తనకు మద్దతుగా ఉన్నారని అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరుగనున్నది. ఈ నేపథ్యంలో రైతులను కారుతో తొక్కించి చంపిన లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తున్నదని తెలిపారు. కేసు దర్యాప్తు ఆగబోదని అన్నారు. సుప్రీంకోర్టు ఎలా కొరితే ఆ విధంగా ఆ జడ్జీతో దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.