ముంబై : కొవిడ్-19 సెకండ్ వేవ్ రోజుల వ్యవదిలోనే ప్రాణాలను కబళిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం ఆక్సిజన్ అందక కన్న కొడుకు, కుటుంబ సభ్యులు చూస్తుండగానే 57 ఏండ్ల దీపక్ మాత్రే కన్నుమూయడం పలువురి కండ్లు చెమర్చింది. ఆక్సిజన్ బెడ్ కోసం గంటల తరబడి నిరీక్షించిన దీపక్ ఎంతకీ బెడ్ లభించకపోవడంతో బాంద్రాలోని బాబా ఆస్పత్రి వెలుపల వీల్ ఛైర్ లోనే కుప్పకూలాడు. ఆక్సిజన్ కొరతతో తమ తండ్రికి బెడ్ ఇవ్వకపోవడంతో ఈ దారుణం జరిగిందని దీపక్ మాత్రే కుమారుడు శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
గత వారం దీపక్ కు మలేరియా పాజిటివ్ రావడంతో జ్వరం ఇతర లక్షణాలున్నా కొవిడ్-19ను అనుమానించలేదు. ఆదివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రి వార్ రూమ్ ను కుటుంబ సభ్యులు సంప్రదించారు. తమ వద్ద ఆక్సిజన్ బెడ్లు లేవని చెప్పడంతో పలు ఆస్పత్రుల్లో వాకబు చేసిన అనంతరం బాంద్రాలోని బాబా ఆస్పత్రికి తమ తండ్రిని తరలించామని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అక్కడ సైతం ఆక్సిజన్ బెడ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని, ఈలోగా ఆక్సిజన్ లెవెల్స్ 55కు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతకీ ఆక్సిజన్ అందక తన కండ్ల ఎదుటే నరకయాతన అనుభవిస్తూ తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని శ్రీకాంత్ కన్నీటిపర్యంతమయ్యాడు. కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ లేకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్నా తన తండ్రిని పలు ఆస్పత్రులు అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించాయని ఆవేదన వ్యక్తం చేశాడు.