లక్నో: ఒక యువ జంటను హత్య చేసి (Family Kills Couple) వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. యువతీయవకుడు సూసైడ్ చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే అసలు విషయం తెలియడంతో యువతి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసివాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాయంపూర్ నివార్వార గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువకుడు, ఠాకూర్ వర్గానికి చెందిన 17 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మార్చిలో వారిద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు. యువతి కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వారం తర్వాత వారిద్దరిని గుర్తించారు. యువకుడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. యువతిని ఆమె కుటుంబానికి అప్పగించారు.
కాగా, ఆ యువకుడు బెయిల్పై విడుదలయ్యాడు. యువతి మేజర్ అయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్తానని గ్రామస్తులతో అతడు చెప్పాడు. అయితే ఉన్నత వర్గానికి చెందిన యువతి కుటుంబం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు ఆ దళిత యువకుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. అనంతరం యువతిని కూడా చంపారు. వారిద్దరి మృతదేహాలను గ్రామంలోని మామిడి చెట్టుకు వేలాడదీశారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. అలాగే తమ కుమార్తెను ఆ యువకుడు కిడ్నాప్ చేసినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు యువ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబం తన కుమారుడ్ని హత్య చేసినట్లు యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. దళిత వ్యక్తితో ప్రేమ వ్యవహారం వల్లనే యువతి కుటుంబం వారిద్దరినీ హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. యువతి తండ్రితోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిపై ఎస్సీఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.