భోపాల్: ఫేక్ ఓటింగ్పై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. (Clash Over Fake Voting) ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చక్రంపూర్ గ్రామానికి చెందిన యోగేంద్ర భదౌరియా, వీర్ సింగ్ కుష్వాహా కుటుంబాల మధ్య గణేష్ ఊరేగింపు సందర్భంగా వివాదం జరిగింది. డీజే మ్యూజిక్ ప్లే చేయడంపై రెండు కుటుంబాల మధ్య చెలరేగిన గొడవ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తారాస్థాయికి చేరింది. వీర్ సింగ్ కుష్వాహా కుటుంబం నకిలీ ఓట్లు వేసినట్లు యోగేంద్ర భదౌరియా కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో శనివారం సుమారు 200 మందితో కూడిన గుంపు యోగేంద్ర భదౌరియా వర్గంపై దాడి చేసింది. ఒక కారుకు నిప్పుపెట్టగా అందులో ఉన్న వ్యక్తి సజీవంగా కాలి చనిపోయాడు. పారిపోతున్న గుంపుపై కొందరు కాల్పులు జరుపగా ఇద్దరు మరణించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ గ్రామానికి చేరుకున్నారు. రెండు కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణ వల్ల ముగ్గురు మరణించినట్లు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ హింసకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘర్షణకు పాల్పడిన ఐదుగురు నిందితుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేసినట్లు వెల్లడించారు. మరోవైపు శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఆ గ్రామంలో కర్ఫ్యూ విధించడంతోపాటు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.