న్యూఢిల్లీ, ఆగస్టు 12: జడ్జిల జీవితం అత్యంత సుఖవంతమైనదన్న ఒక అపోహ ప్రజల్లో ఉన్నదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టు జడ్జి రోహిన్టన్ నారిమన్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు సమావేశం నిర్వహించింది. జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ‘జడ్జిల జీవితం సుఖవంతమైంది. వాళ్లు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పని ఉంటుంది. సెలవు దినాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు అని ప్రజలు భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. వారానికి వందకు పైగా కేసుల్లో వాదనలు విని, తీర్పు ఇవ్వడానికి తగిన విధంగా సన్నద్ధం కావడం అంత సులభం కాదు’ అన్నారు.
సింహాన్ని కోల్పోతున్నా
‘న్యాయవ్యవస్థకు ఇన్నాళ్లు రక్షణగా నిలిచిన ఓ సింహాన్ని కోల్పోతున్నానన్న భావన కలుగుతున్నది’ అని జస్టిస్ నారిమన్ను ఉద్దేశించి జస్టిస్ రమణ అన్నారు. నారిమన్ 2014 జూలై 7న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 13,500కు పైగా కేసుల్లో తీర్పు ఇచ్చారు.