బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరాని(Cyber Fraud)కి బాధితుడయ్యాడు. సైబర్ క్రిమినల్స్ వేసిన వలలో చిక్కుకున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి తన అకౌంట్లలో ఉన్న 69 లక్షల డబ్బును పోగొట్టుకున్నాడు. ఢిల్లీకి చెందిన సీఐడీ, బ్యాంక్ అధికారులమంటూ చెబుతూ ఆ తర్వాత ఆదాయపన్ను దర్యాప్తు చేపట్టాలని ఓ బాధితుడిని మోసం చేశారు.
ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కొందరు తొలుత బాధితుడికి ఫోన్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ బ్రాంచ్లో క్రెడిట్ కార్డుకు చెందిన 1.45 లక్షల బాకీ ఉన్నట్లు చెప్పారు. దీంతో టెన్షన్కు గురైన బాధితుడు తనకు రాజస్థాన్లో ఎటువంటి అకౌంట్ లేదన్నాడు. ఎవరో తన పేరు మీద కార్డు తీసుకుని తప్పుగా వాడుతున్నట్లు సైబర్ క్రిమినల్స్ బెదిరించారు. క్రెడిట్ కార్డు కేసులో బయటకు రావాలంటూ 5 లక్షలు చెల్లించాలని బెదిరించారు. ఆ సమయంలో నిజానికి బాధితుడు యూరోప్ టూర్లో ఉన్నాడు. కానీ ఆ భయంతో బాధితుడు తొలుత 5 లక్షలు చెల్లించాడు.
బాధితుడు లొంగిపోయినట్లు గ్రహించిన క్రిమినల్స్.. ఆదాయపన్ను దర్యాప్తు పేరుతో మళ్లీ బెదిరించారు. క్రిమినల్స్ మాయలో పడ్డ ఆ బాధితుడు వాళ్లకు సుమారు 69 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. మార్చి 6 నుంచి 17వ తేదీ వరకు ఏడు బ్యాంకు అకౌంట్లకు ఆ డబ్బును పంపాడు. ఏప్రిల్ 6వ తేదీన తనకు జరిగిన మోసం గురించి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టులోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫెడ్ఎక్స్ కొరియర్ ఫ్రాడ్ తరహాలో ఈ స్కామ్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు అకౌంట్లలో ఉన్న సుమారు 4 లక్షల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు.